ఇసుకకు సంబంధించి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

ఇసుకకు సంబంధించి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంటోంది. ఇసుక ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న తర్వాత నాణ్యమైనది సరఫరా కాకపోతే. దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు. మళ్లీ నాణ్యమైన ఇసుక ఉచితంగా అందేలా చూడనున్నారు. ఈ మేరకు ఏపీ ఏపీఎండీసీ ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఇంటికి డెలివరీ చేసిన ఇసుక నాణ్యత లేదని.. మట్టితో కలిసి ఉంటే ఏం చేయాలో కొనుగోలుదారులకు అర్ధం కావడం లేదు. జిల్లాల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయట. ఈ నాణ్యతలేని ఇసుక నిర్మాణాలకు ఉపయోగపడటం లేదట.. చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు మంత్రి పినిపే విశ్వరూప్‌కు సైతం గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో ఇంటి నిర్మాణానికి నాసిరకం ఇసుక సరఫరా చేశారు. ఈ వ్యవహారంపై ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే మిగిలిన చోట్లా ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరోవైపు తవ్వితీసిన ఇసుక పరిమాణం, స్టాక్‌ పాయింట్లలోని నిల్వల లెక్క తేల్చేందుకు డ్రోన్లతో సర్వే చేయించాలని అధికారులు నిర్ణయించారు. కొద్ది నెలల కిందట జరిగిన ఇసుక తవ్వకాల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి ఆడిట్‌ చేయించారు. ఈ ఆడిట్‌ రిపోర్ట్‌ను ఏపీఎండీసీకి అందజేశారు. ఈ లెక్కలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు మరోసారి డ్రోన్‌ ద్వారా సర్వే చేయించాలని నిర్ణయించారు. ఆడిట్‌ నివేదిక వివరాలను, డ్రోన్‌ పరిశీలనలో తేలిన లెక్కల్ని పరిశీలించనున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2WYOWYc

Comments