ఇంగ్లాండ్ గడ్డపై చివరి టెస్టులో వెస్టిండీస్ ఓటమిని వర్షం ఒక్కరోజు అడ్డుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న విజేత నిర్ణయాత్మక మూడో టెస్టులో 399 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. రెండు రోజుల పాటు ఇంగ్లాండ్ బౌలర్లని కాచుకోగలదా..? అని అందరూ సందేహించారు. మరికొందరైతే సోమవారం రెండో సెషన్కే మ్యాచ్ని ఇంగ్లాండ్ ముగించేస్తుందని అంచనాలు వేశారు. కానీ.. అనూహ్యంగా.. భారీ వర్షంతో సోమవారం ఆటలో కనీసం ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో.. మ్యాచ్ ఫలితం చివరి రోజుకి చేరింది. ఛేదనలో ప్రస్తుతం 10/2తో ఉన్న వెస్టిండీస్.. ఆటలో ఆఖరిరోజైన మంగళవారం మూడు సెషన్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లని ఎదిరించి నిలబడగలదా..? గెలుపుపై ఎవరికీ అంచనాల్లేవ్. కనీసం డ్రాగా ముగించాలనుకున్నా.. కరీబియన్ బ్యాట్స్మెన్లు గొప్పగా పోరాడాల్సిందే..! మాంచెస్టర్ వేదికగా శుక్రవారం ఆరంభమైన ఈ మూడో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 369 పరుగులకి తొలి ఇన్నింగ్స్లో ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు పేలవ రీతిలో 197 పరుగులకే కుప్పకూలి.. 172 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఆతిథ్య జట్టుకి కట్టబెట్టింది. దాంతో.. రెండో ఇన్నింగ్స్లో మరింత దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ 226/2తో డిక్లేర్ చేసింది. మొత్తంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 172 పరుగుల్ని కలుపుకుని 399 లక్ష్యాన్ని వెస్టిండీస్కి ఇంగ్లాండ్ నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనని వెస్టిండీస్ పేలవంగా ఆరంభించింది. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (0), కీమర్ (4) సింగిల్ డిజిట్కే వికెట్ చేజార్చుకోగా.. మరో ఓపెనర్ క్రైగ్ బ్రాత్వైట్ (2 బ్యాటింగ్), షై హోప్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆటలో ఇంకా ఒక్క రోజు మిగిలి ఉండగా.. డ్రా కోసం కనీసం 90 ఓవర్లు విండీస్ బ్యాట్స్మెన్లు ఆడాల్సి ఉంటుంది. అయితే.. గొప్ప ఉపశమనం ఏంటంటే..? మంగళవారం కూడా మాంచెస్టర్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/32ZorFW
Comments
Post a Comment