బయో- సెక్యూర్ బబుల్‌లోకి ఐపీఎల్.. ఫ్యామిలీస్‌కి నో ఎంట్రీ..?

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. సీజన్‌ని బయో- సెక్యూర్ వాతావరణంలో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరగనుండగా.. మొత్తం 51 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. ఇందులో డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఐదు ఉండే అవకాశం ఉంది. సుదీర్ఘంగా సాగే ఈ టోర్నీని పూర్తి సురక్షిత వాతావరణంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న బీసీసీఐ.. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ.. ఆటగాళ్లు, ఫ్రాంఛైజీలు, బ్రాడ్‌కాస్టర్ నుంచి ఎన్నో సమాధానంలేని ప్రశ్నలు తెరపైకి వస్తున్నట్లు సమాచారం. బయో-సెక్యూర్ బబుల్ అంటే ఏమిటంటే..? కరోనా వైరస్ నేపథ్యంలో.. టోర్నీలో భాగమయ్యే క్రికెటర్లు, మ్యాచ్ అధికారులతో టీమ్‌ కోచ్‌లు, సహాయ సిబ్బంది‌ని తొలుత 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ సమయంలో రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ అని తేలిన తర్వాతే ఒక బబుల్‌లోకి వారిని చేరుస్తారు. ఇక అప్పటి నుంచి వెలుపలి వ్యక్తుల్ని వారు పర్సనల్‌గా కలిసేందుకు అనుమతించరు. మ్యాచ్‌కి ముందు కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ అని తేలితేనే ఆటలోకి అనుమతిస్తారు. ఎవరైనా ఈ బయో- సెక్యూర్ బబుల్ దాటి వెలుపలికి వెళ్లినా లేదా బబుల్ రూల్స్ బ్రేక్ చేసినా.. వారిని కనీసం ఐదు రోజులు క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు కరోనా పరీక్షలు చేసి.. అందులో నెగటివ్ అని తేలితేనే మళ్లీ బబుల్‌లోకి అనుమతిస్తారు. ఇంగ్లాండ్ గడ్డపై వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌‌‌కి ఈ బయో-సెక్యూర్ బబుల్ వాతావరణాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేయగలిగింది. దాంతో.. ఐపీఎల్‌ 2020 సీజన్‌కి అదే బాటలో బీసీసీఐ పయనించబోతోంది. కానీ.. లెక్కకి మించి సవాళ్లు బీసీసీఐకి ఎదురుకాబోతున్నాయి. అది ఎలాగంటే..? సుదీర్ఘంగా సాగే ఐపీఎల్ సమయంలో క్రికెటర్ల వెంట వారి ఫ్యామిలీస్, గర్ల్‌ఫ్రెండ్స్ ఉండటం 2008 నుంచి కొనసాగుతోంది. మరి వారిని బయో- సెక్యూర్ బబుల్‌లోకి తీసుకురావడం సాధ్యమేనా..? ఐపీఎల్‌లో క్రికెటర్లతో పాటు కోచ్‌లు, సహాయ సిబ్బంది, టీమ్ మేనేజ్‌మెంట్ రూపంలో దాదాపు 400-500 మంది ఆటలో భాగమవుతారు. మరి వారందరినీ బబుల్‌లో ఉంచి హ్యాండిల్ చేయగల సామర్థ్యం బీసీసీఐ అధికారుల వద్ద ఉందా..? ఆటగాళ్లు బస చేసే హోటల్స్‌.. అందులో పనిచేసే సిబ్బంది, ట్రావెల్స్, సెక్యూరిటీ ఇలా ఎన్నో సవాళ్లు బీసీసీఐ ముందు కనిపిస్తున్నాయి. టోర్నీకి నెల రోజుల ముందు అంటే.. ఆగస్టు 20 నాటికి టీమ్స్‌ని యూఏఈకి పంపే ఏర్పాట్లు చేసుకోవాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఇప్పటికే ప్రాథమికంగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2X5kZ98

Comments